ప్రధాని మోదీని ఉద్దేశించి పరోక్షంగా అవమానకర వ్యాఖ్యలు చేసిన ఇమ్రాన్ ఖాన్

- September 22, 2018 , by Maagulf
ప్రధాని మోదీని ఉద్దేశించి పరోక్షంగా అవమానకర వ్యాఖ్యలు చేసిన ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ శాంతి చర్చల కోసం తాను ఇచ్చిన ఆహ్వానాన్ని భారత్ తిరస్కరించడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో అక్కసు వెళ్లగక్కారు. ''తక్కువ స్థాయి వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉన్నారంటూ...'' ప్రధాని మోదీని ఉద్దేశించి పరోక్షంగా అవమానకర వ్యాఖ్యలు చేశారు. ''దురహంకారం''తోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుందంటూ చిందులు తొక్కారు. భారత్-పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని రద్దుచేస్తూ భారత్ నిర్ణయించడంపై ఇవాళ ఇమ్రాన్ ట్విటర్లో స్పందిస్తూ.. ''శాంతి చర్చలు పునరుద్ధరించాలంటూ నేను ఇచ్చిన పిలుపుపై భారత్ దురహంకారపూరిత, ప్రతికూల స్పందనపై తీవ్ర నిరాశకు గురయ్యాను. ఉన్నత పదవులు చేపట్టిన తక్కువ స్థాయి వ్యక్తులను నేను చాలామందిని చూశాను. విశాల ప్రపంచాన్ని చూడగల దార్శనికత వారికి ఉండదు..'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఇమ్రాన్ ఖాన్‌కు శుభాకాంక్షలు చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖరాసిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా పాక్ ప్రధాని స్పందిస్తూ భారత్-పాక్ మధ్య మళ్లీ శాంతి చర్చలను పునరుద్ధరించాలంటూ భారత్‌ను కోరారు. దీంతో న్యూయార్క్‌లో జరిగే ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత్- పాక్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ అంగీకారం తెలిపింది. అయితే ఆ మరుసటి రోజే కశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి హతమార్చారు. దీనికి కొద్ది గంటల ముందే పాకిస్తాన్ సైనిక మూకలు భారత జవాను నరేంద్ర సింగ్‌ను అత్యంత కిరాతంగా గొంతుకోసి చంపాయి. ఈలోగానే ఉగ్రవాది బుర్హాన్ వనీని కశ్మీర్ స్వాతంత్ర్య పోరాట యోధుడిగా కీర్తిస్తూ పాకిస్తాన్‌లో పోస్టల్ స్టాంపును విడుదల చేయడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త ప్రధాని ఇమ్రాన్ ''నిజ స్వరూపం'' బయటపడిందనీ.. పాకిస్తాన్ వక్ర బుద్ధి తేటతెల్లమైందంటూ ఇరు దేశాల మధ్య జరిగే సమావేశాన్ని భారత్ రద్దు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com