తెలంగాణ ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం

- September 28, 2018 , by Maagulf
తెలంగాణ ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం

నాలుగు రాష్ట్రలతో పాటు తెలంగాణలో ఎన్నికల నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. సీఈసీ రావత్‌ ఆధ్వర్యంలో కేంద్రం ఎన్నికల సంఘం ఢిల్లీలో భేటీ అయిన తరువాత నిర్ణయించింది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన ఎన్నికల బృందం.. ముందస్తుపై సంతృప్తి వ్యక్తం చేయడంతో అక్టోబర్‌ 8న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముందస్తు ఎన్నికలపై సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది..

తెలంగాణలో ఎన్నికలకు త్వరలో ముహూర్తం ఖరారు కానుంది. ఢిల్లీలో సమావేశమైన సీఈసీ.. ఇక్కడి ముందస్తు పరిస్థితిపై పాజిటివ్‌ రిపోర్ట్స్‌ అందినట్టు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ఉమేశ్‌ సిన్హా బృందం ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చింది. దీంతో త్వరలో ఎన్నికలు జరగబోయే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరాంతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు జరిపితే బాగుటుందని కేంద్రం ఎన్నికల సంఘం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే మరో పది రోజుల్లో ఎన్నికల బృందం తెలంగాణలో పర్యటించి ఫైనల్‌ డిసెషన్‌ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ వస్తుంది ప్రచారం జరుగుతోంది..

ఇటీవల ఉమేశ్‌ సిన్హా నేతృత్వంలోని ఈసీ బృందం పలు రాజకీయ పార్టీలతో సమావేశమై అభిప్రాయాలను సేకరించింది. అన్ని జిల్లాల కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో భేటీ అయి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు గల పరిస్థితులపై ఆరా తీసింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన ఉమేశ్‌ సిన్హా బృందం ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రం ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించింది.

ఇదే సమయంలో ముందస్తు ఎన్నికలపై సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణపై వచ్చిన అభ్యంతరాలకు వారం లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

తెలంగాణలో ఎన్నికలపై CEC తొందరపడ్తోందని పిటిషనర్లు ఆరోపించారు. ఓటర్ గా నమోదు చేసుకోవడానికి 2018 జనవరి ఒకటిని కటాఫ్ డేట్ గా పెట్టడాన్ని తప్పుపట్టారు. షెడ్యూల్ ప్రకారం 2019 ఏప్రిల్, మే నెలలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని.. అప్పుడు 2019 జనవరి 1ను కటాఫ్ డేట్ గా ఎలా పెడతారన్నారు. 2018లో.. 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సుమారు 20 లక్షల మందికి ఓటు హక్కు దక్కడం లేదని పిటిషనర్లు వాదించారు.

తెలంగాణ ఓటర్ల జాబితాలోని అవకతవకలపై దాఖలైన పిటిషన్ పైనా సీఈసీకి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. ఓటర్ల జాబితాలోని తప్పులను, నకిలీ ఓట్ల వివరాలను ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, సుప్రీం కోర్టు ముందు ఉంచామన్నారు.

ఓ వైపు అక్టోబర్‌లో 8న ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని ప్రచారం జరుగుతుంటే.. ఐదో తేదీన సుప్రీం కోర్టులో ముందస్తుపై విచారణ జరగనుండడంతో ఏం జరుగుతోందనని పొలిటికల్‌ పార్టీలు టెన్షన్‌ పడుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ కచ్చితంగా నిలిచిపోతుందని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడుతన్నారు. సీఈసీ మాత్రం ఎలక్షన్స్‌కు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తోంది.. మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com