భారత్ లో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు

- October 10, 2018 , by Maagulf
భారత్ లో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు

భారత్ లో నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, లక్నో వంటి నగరాల్లోని ఆలయాలతో పాటు జమ్మూకాశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయంతో 9రోజుల పాటు జరిగే శరన్నవరాత్రి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దసరా వేడుకలను బెంగాలీలు, కన్నడవాసులు, తెలుగువాళ్లు వైభవంగా జరుపుకుంటారు.

కర్ణాటక: ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. 10 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు నవరాత్రితో మొదలై చివరిరోజు విజయదశమితో ముగుస్తాయి.

ఆంధ్ర:
 దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటీ.. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీప కాంతులతో దుర్గమ్మ ఆలయాన్ని ముస్తాబు చేసింది. మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గమ్మగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. కాగా.. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు.

పది రోజుల్లో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తారు. ఒక్కో అలంకారానికి ఒక్కో ప్రత్యేకత. స్వర్ణకవచాలంకృత కనకదుర్గ,బాలా త్రిపురసుందరీ దేవి, గాయత్రీ దేవి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, మహాలక్ష్మి, సరస్వతీ దేవి, కనకదుర్గ, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు.

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి సన్నిథిలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ శ్రీ పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అటు తిరుమలలో నేటి నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకొక వాహన సేవలో దర్శనమివ్వనున్నారు. అటు శరన్నవరాత్రుల ప్రారంభమైన సందర్భంగా రాష్ట్రంలో అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు.

తెలంగాణ: 
వరంగల్‌లోని భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. 9 రోజుల పాటు నిర్వహించే నవరాత్రి మహోత్సవాల కోసం ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీభద్రకాళీ అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.

హన్మకొండలోని శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల ప్రారంభయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కొలువై ఉన్న రాజన్న ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బాసర ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అటు శరన్నవరాత్రుల ప్రారంభమైన సందర్భంగా రాష్ట్రంలో అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com