దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో యుఎవిల తయారీ

- December 16, 2018 , by Maagulf
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో యుఎవిల తయారీ

ప్రైవేటు రంగంలో దేశంలోనే తొలిసారిగా అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికల్‌ (యుఎవి)ను హైదరాబాద్‌లో తయారు చేయనున్నారు. ఇజ్రాయెల్‌ కంపెనీ ఎల్‌బిట్‌ సిస్టమ్స్‌కు చెందిన హెర్మిస్‌ 900 యుఎవిలను తయారు చేయడానికి ఎల్‌బిట్‌ సిస్టమ్స్‌, అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థ అదానీ ఎల్‌బిట్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఇండియా హైదరాబాద్‌ సమీపంలో 20 ఎకరాల్లో ఉన్న అదానీ ఏరోస్పేస్‌ పార్కులో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది.

అదానీ ఎల్‌బిట్‌ అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వేహికల్స్‌ కాంప్లెక్స్‌ను తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. సంయుక్త సంస్థలో అదానీ డిఫెన్స్‌కు 51 శాతం వాటా, ఇజ్రాయెల్‌ కంపెనీకి 49 శాతం వాటా ఉంది. అదానీ ఎల్‌బిట్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ను ఏడాదిన్నర క్రితం ఏర్పాటు చేశారు. ఈ సంయుక్త సంస్థలో 1.5 కోట్ల డాలర్లు (దాదాపు రూ.100 కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టినట్లు అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ అధిపతి ఆశిష్‌ రాజ్‌వంశీ తెలిపారు. యూఏవీ కాంప్లెక్స్‌ 50,000 చదరపు అడుగుల్లో విస్తరించి ఉందని, ఇందులో 40-45 ఏరోస్పేస్‌ రంగంలో అత్యంత నైపుణ్యాలు కలిగిన నిపుణులు పని చేస్తారని చెప్పారు.

ముందుగా మీడియం ఆల్టిట్యూడ్‌ లాంగ్‌ ఎండూర్యాన్స్‌ యుఎవి- హెర్మిస్‌ 900కు చెందిన కంప్లీట్‌ కార్బన్‌ కంపోజిట్‌ ఏరోస్ట్రక్చర్లను ఇక్కడ తయారు చేస్తారు. ఆ తర్వాత హెర్మిస్‌ 450 స్ట్రక్చర్లను ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో యూఏవీలను తయారు చేస్తారని ఎల్‌బిట్‌ సిస్టమ్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (సిఇఒ) బెజ్‌హాలెల్‌ మక్లిస్‌ తెలిపారు. ముందుగా ఎగుమతులు చేస్తామని, ఆ తర్వాత బిడ్డింగ్‌ కార్యక్రమంలో పాల్గొని భారత రక్షణ దళాలకు సరఫరా చేస్తామని ఆశిష్‌ వివరించారు. భారత్‌కు దాదాపు 150 యుఎవిల అవసరం ఉందని అంచనా. 2019 మార్చినాటికి మొదటి యుఎవి ఉత్పత్తి చేస్తారు. 2019లో మొత్తం 4, 2020కు 18 యూఏవీలను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com