అంతకంతకూ ముదురుతోన్న ఐటీ గ్రిడ్‌ డేటా వివాదం

- March 05, 2019 , by Maagulf
అంతకంతకూ ముదురుతోన్న ఐటీ గ్రిడ్‌ డేటా వివాదం

ఐటీ గ్రిడ్‌ డేటా కేసు వివాదం అంతకంతకూ ముదురుతోంది. డేటా కేసు ఓ వైపు రాజకీయ దుమారం రేపుతోంది. మరోవైపు ఈ వివాదం ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య వార్‌గా మారింది. ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌రెడ్డిని ఏపీ పోలీసులు బెదిరించారంటూ తెలంగాణలో కేసు నమోదైంది. కేసును సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కీలక సుత్రధారి అశోక్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఏపీలోనే అశోక్ ఉన్నట్టు తెలంగాణ పోలీసుల అనుమానిస్తున్నారు.

 

డేటా కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐటీ గ్రిడ్‌ కేసు వ్యవహారంలో ఫిబ్రవరి 23నే అశోక్‌ను పిలిచి సీసీఎస్‌ పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. 27న మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో అశోక్‌ అప్రమత్తమై 27న తన కార్యాలయ కంప్యూటర్లలోని కొంత సమాచారం తొలగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డేటా చోరీ గుర్తించకుండా ఉండేందుకు తెలివిగా వ్యవహిరించిన ఐటీ గ్రిడ్‌ అమెజాన్‌ సర్వీస్‌ క్లౌడ్‌ లింక్స్‌తో పెట్టుకున్నారనే కోణంలో వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు.

డేటా చోరీ కేసుపై ఏపీ ఎన్నికల సంఘం సైతం స్పందించింది. రాజకీయ విమర్శలతో తమకు సంబంధంలేదన్నారు గోపాల కృష్ణ ద్వివేది. తమ సిబ్బంది తప్పు చేస్తే సస్పెండ్ చేస్తామని, F.I.R నమోదు చేసి దర్యాప్తుకు ఆదేశిస్తామన్నారు. ఐటీ గ్రిడ్ కేసులో ఓటరులిస్టు ఎక్కడ నుంచి వచ్చిందో సజ్జనార్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కేసుపై స్పందించిన ఏపీ ఐటీ సెక్రటరీ విజయానంద్‌.. ఆధార్‌ డేటా చోరీకి గురయ్యే అవకాశం లేదన్నారు. పూర్తి భద్రత మధ్య ఆధార్‌ డేటా ఉందని వివరణ ఇచ్చారు. డేటా లీకేజీ అయ్యిందన్న మాట అవాస్తమన్నారు. ఆధార్‌ డేటా అన్నది కేంద్ర పరిధిలోనే ఉంటుందన్నారు విజయానంద్‌..

విచారణలో భాగంగా పోలీసులు ఎక్కడికైనా వెళ్లొచ్చు.. ఎవర్నైనా విచారణ చేయొచ్చన్నారు ఏపీ డీజీపీ ఠాకూర్‌. ఈ కేసు విచారణలో భాగంగానే లోకేశ్వర్‌ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారని ఆయన స్పష్టం చేశారు. ఐటీ గ్రిడ్‌ సీఈఓ అశోక్‌ ఏపీలో ఉన్నట్టు తమకు సమాచారం లేదన్నారు.

ఐటీ గ్రిడ్‌ డేటా కేసు వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. పూర్తిగా పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ మంత్రులు ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదిని కలిశారు. ఫామ్‌ -7 దరఖాస్తుల అంశంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. టిఆర్‌ఎస్‌తో కుమ్మక్కైన వైసీపీ.. తమ డేటాను చోరీ చేసే ప్రయత్నం చేసిందని ఏపీ మంత్రులు ఆరోపించారు. తెలంగాణలోని ఇలాంటి పనులే చేశారని, ఏపీలోనూ అదే తరహా అక్రమ విధానాలు అమలుచేస్తున్నారని మండిపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com