APNRTS ఆధ్వర్యంలో ఎక్స్ గ్రేషియా చెక్కుల పంపిణి

- February 24, 2020 , by Maagulf
APNRTS  ఆధ్వర్యంలో ఎక్స్ గ్రేషియా చెక్కుల పంపిణి

అమరావతి:ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల క్షేమమే ధ్యేయంగా వారికి వలందించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోహన్ రెడ్డి  ఆదేశానుసారం ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) పనిచేస్తోంది. APNRTS ప్రవాసాంధ్రులకు అందిస్తున్న వివిధ సేవలలో  ఎక్స్ గ్రేషియా ఒకటి. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు  వెళ్లి  ప్రమాదవశాత్తు మృతిచెందిన ప్రవాసాంధ్రుల కుటుంబాలను  ఆర్ధికంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 50 వేల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి ఇవాళ సొసైటీ  కార్యాలయంలో సంబంధిత 12 బాధిత  కుటుంబాలకు అందజేశారు. 

చెక్కుల పంపిణీ అనంతరం APNRTS అధ్యక్షులు వెంకట్ మేడపాటి మాట్లాడుతూ... ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ప్రవాసాంధ్రులు అధిక సంఖ్యలో ఉన్నారని, అందులోను వై.యస్.ఆర్. జిల్లా మరియు ఉభయ గోదావరి జిల్లాల నుండి ఉపాధి కోసం వెళ్ళే వారు  ఎక్కువగా ఉన్నారన్నారు.  వీరు అక్కడ పలు సంస్థల్లో డ్రైవర్లుగా, కాంట్రాక్ట్ కూలీలుగా, గృహ కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దురదృష్టవశాత్తు కొన్ని సందర్బాల్లో అనారోగ్యం బారినపడడం, వృత్తిపరమైన  ప్రమాదాల్లో మృతి చెందడం జరుగుతోందన్నారు. కుటుంబ పెద్ద మృతితో దిక్కు తోచని స్థితిలో ఉన్న  కుటుంబాలకు  ఆర్థిక చేయూతనందించే లక్ష్యంతో  రాష్ట్ర ప్రభుత్వం APNRTS ద్వారా సంబంధిత మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్ గ్రేషియాను అందిస్తోందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న APNRTS ప్రవాసాంధ్రులకు ఎన్నో సేవలను అందిస్తోందని.. ముఖ్యంగా విదేశాల్లో మరణించిన ప్రవాసాంధ్రులకు మరియు  ఎవరైతే కదలలేని స్థితిలో నిస్సహాయంగా ఉన్నారో అలాంటి వారికి సహాయంగా ఒక సహాయకుడిని ఇచ్చి ఉచిత అంబులెన్స్ సేవ అందించడం, విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఆమ్నెస్టీ (ఆయా దేశాల క్షమాబిక్ష) ద్వారా ఆ దేశ ప్రభుత్వానికి ఇమ్మిగ్రేషన్ జరిమానాలు చెల్లించి, విమాన చార్జీలు, ఆహార ఖర్చులు సమకూర్చి, బాధితులను వారి స్వస్థలాలకు చేర్చడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రవాసాంధ్రులను భారతదేశానికి తిరిగి తీసుకురావడం,  ప్రవాసాంధ్రుల కుటుంబ ఆర్ధిక భద్రతలో భాగంగా ప్రవాసాంధ్ర భరోసా భీమా అందించడం చేస్తోందన్నారు.
చెక్కులను అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు సీఎం జగన్ కి, APNRTS అధ్యక్షులు వెంకట్ మేడపాటికి కృతఙ్ఞతలు తెలిపారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం లో సీఈఓ (ఇన్ ఛార్జ్ )మల్లేశ్వర రావు, డిప్యూటీ డైరెక్టర్ (ఆపరేషన్స్) మహమ్మద్ కరీం, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com