కరోనా పై మరింత అప్రమత్తంగా ఉందాం-మేయర్ బొంతు రామ్మోహన్
- March 13, 2020
హైదరాబాద్:కరోనా వైరస్ను అరికట్టేందుకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. గురువారం జిహెచ్ఎంసి కార్యాలయంలో కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్తో కలిసి అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, హెచ్.ఓడిలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ శానిటేషన్ వర్కర్లు తప్పనిసరిగా రేడియం ఆఫ్రాన్, గ్లౌజులు, మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు. తదనుగుణంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న శానిటేషన్ సూపర్ వైజర్లను, ఫీల్డ్ అసిస్టెంట్లను బాధ్యులను చేయాలని తెలిపారు. అలాగే మొదటి విడత బయోమెట్రిక్ హాజరు నమోదు సమయాన్ని ఉదయం 5 నుండి 6గంటల వరకు మాత్రమే అనుమతించాలని తెలిపారు. శీతాకాలంలో బయోమెట్రిక్ హాజరును ఉదయం 7:30గంటల వరకు అనుమతించామని, ప్రస్తుతం వేసవి కాలం అయినందున జూన్ వరకు ఉదయం 5గంటల నుండే శానిటేషన్ ప్రక్రియ ప్రారంభం కావాలని చెప్పారు. ఉదయం 6:30గంటలలోపు రోడ్లపై పారిశుధ్య పనులు పూర్తి అయితే, ఆ చెత్తను వెంటనే తొలగించుటకు చర్యలుతీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 7గంటల తర్వాత ప్రజలు రోడ్లపైకి వస్తున్నందున పారిశుధ్య పనులకు, చెత్త తరలింపుకు ఇబ్బంది అవుతుందని తెలిపారు. తద్వారా అక్కడక్కడ రోడ్లపైన అపరిశుభ్రత, చెత్తకుప్పలు ఉంటున్నాయని తెలిపారు. చెత్తకుప్పల తరలింపులో జాప్యం జరగడం వలన ట్రాఫిక్కు ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. శానిటేషన్ బాధ్యతలు అప్పగించిన ఇంజనీరింగ్ విభాగం డి.ఇలకు, ప్రతి డి.ఇ పరిధిలో నియమితులైన ఇద్దరు ఏ.ఇ లకు తమ విధులపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. బయోమెట్రిక్ హాజరు నమోదు వద్ద హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. శానిటేషన్ సూపర్ వైజర్లు, అసిస్టెంట్లు కూడా రేడియం ఆఫ్రాన్లను తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. ఏడుగురు శానిటేషన్ వర్కర్లను ఒక గ్రూపుగా ఉంచి విధులు అప్పగిస్తున్నామని, వారిలో ఒకరు వారాంతపు సెలవులో ఉంటే ఆరుగురు తప్పనిసరిగా విధులలో ఉండాలని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలలో భాగంగా దేశంలోని కొన్ని నగరాల్లో బయోమెట్రిక్ హాజరును తాత్కాలికంగా తొలగించారని, మన జిహెచ్ఎంసిలో కూడా ఆ విధంగా బయోమెట్రిక్ హాజరు తొలగింపు అంశంపై సమావేశంలో చర్చించారు. అయితే శానిటేషన్ వర్కర్ల హాజరు నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని, కార్మికుల గైర్హాజరు వలన పారిశుధ్య పనులకు విఘాతం కలుగుతుందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. అదేవిధంగగా బయోమెట్రిక్ హాజరు నమోదుతో విధులకు రాని వర్కర్ల వివరాలు వెంటనే తెలుస్తున్నాయని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక నుండి మూడు నెలల పాటు విధులకు గైర్హాజరైన శానిటరి వర్కర్లను బయోమెట్రిక్ హాజరు సిస్టమ్ నుండి ఆటోమెటిక్ గా తొలగించే సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగులు కూడా 30రోజుల పాటు విధులకు అనధికారికంగా గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలోని కార్యాలయాలలో బయోమెట్రిక్ హాజరు నమోదు చోట హ్యాండ్ శానిటైజర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







