ఏనుగు మృతి తో రేగిన దుమారం..

- June 03, 2020 , by Maagulf
ఏనుగు మృతి తో రేగిన దుమారం..

 

తిరువనంతపురం: పాపం, ఆ ఏనుగు బతికుంటే మరికొన్ని నెలల్లో ఓ గున్న ఏనుగు(15ఏండ్లు)కు జన్మనిచ్చేది. కానీ, కొంతమంది అమానవీయంగా ప్రవర్తించడంతో ఆ మూగజీవి ఈలోకాన్ని విడిచివెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ఏనుగుతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా కన్నుమూశాయి. గర్భంతో ఉన్న ఏనుగు మృతిచెందడంపై కేరళలో దుమారం రేగుతోంది. దీనిపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన పాలక్కడ్‌, మలప్పురం జిల్లా సరిహద్దులో జరిగింది. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌కు చెందిన అధికారి మోహన్‌ కృష్ణన్‌ ఈ దుశ్చర్యను సోషల్‌మీడియాలో వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పైనాపిల్‌ పండు తినడంతో నోట్లో పేలుడు సంభవించిందని, దీంతో ఏనుగు మృతిచెందినట్లు అటవీశాఖ అధికారులు వివరించారు. ఏనుగుకు పోస్ట్‌మార్టం నిర్వహించిన వెటర్నరీ డాక్టర్‌ మాట్లాడుతూ..బాధిత ఏనుగు కడుపులో నెలరోజుల గున్న ఏనుగు ఉన్నట్లు తెలిపారు.

పాలక్కడ్‌ జిల్లాకు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉండే ఏనుగు ఆహారం కోసం సమీపంలోని గ్రామ శివారులోకి వచ్చింది. అడవి పందుల నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు స్థానికులు బాణసంచాతో నింపిన పైనాపిల్‌ పండ్లను పంటల రక్షణ కోసం ఉపయోగించేవారు. ఆహారం కోసం వెతుకుతూ వచ్చిన ఏనుగు పైనాపిల్‌ను నోట్లోకి తీసుకోగానే బాణసంచా పేలడంతో ఏనుగు నాలుక, నోరుకు తీవ్రగాయాలయ్యాయి. ఆకలితో అలమటించిన ఏనుగు భరించలేని నొప్పితో ఆహారం కోసం ఊరంతా తిరిగింది.

ఆ తర్వాత ఏనుగు బాధ భరించలేక వెలియార్‌ నదీలోకి వెళ్లి అందులో నిలబడి కొంతసేపు సేదతీరింది. పేలుడు ధాటికి నోరు, తొండం కాలిపోయిడంతో నొప్పిని తగ్గించుకునేందుకు వాటిని ఎప్పుడూ నీటితో నింపుకుంది. కాలిన గాయాల మీద ఈగలు, కీటకాలు వాలకుండా అలా చేసిందని ఫారెస్ట్‌ అధికారి మోహన్‌ కృష్ణన్‌ తెలిపారు. ఏనుగుకు గాయాలైన విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. మే 27న సాయంత్రం 4 గంటలకు నది మధ్యలోనే ఏనుగు మృతిచెందిందని ఆయన వెల్లడించారు. ఏనుగును అడవిలోకి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించామన్నారు. ఆ ఏనుగు ఇప్పటి వరకు ఎవరికీ హాని చేయలేదని, చాలా మంచిదని అన్నారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com