హైదరాబాద్:డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పేరుతో మోసం...
- July 28, 2020
హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం. పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని...ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. గతంలోనే ఇలాంటి కేసులు నమోదుకాగా...తాజాగా అమాయక ప్రజలను మోసగించిన ఓ వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
దాదాపు 40 మందికి పైగా అమాయక ప్రజల నుంచి గుత్తుల ప్రశాంత్ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. బాధితులు ఒక్కక్కరి నుంచి రూ.1.55 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు డబ్బులు వసూలు చేశాడు. దాదాపు రూ.70 లక్షల మేరకు అతను మోసాలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
10 రోజుల తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ అలాట్ అయ్యిందంటూ నకిలీ మంజూరు పత్రాలు కూడా బాధితులకు అందజేశాడు. తన దగ్గరున్న ల్యాప్టాప్లో నకిలీ డాక్యుమెంట్ను తయారీ చేసి...కలర్ ప్రింట్ తీసి ఇచ్చేవాడు. అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు తెలిపారు.
తమకిచ్చిన డబుల్ బెడ్రూం మంజూరు పత్రాలు నకిలీవని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు కూకట్పల్లి, బాచుపల్లి, మియాపూర్ ప్రాంతాలకు చెందిన దాదాపు 40 మంది వరకు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదుచేసి, నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
విజన్-1 టీవీ ఛానల్ ఛైర్మన్గా చెప్పుకుంటూ గుత్తుల ప్రశాంత్(28) ఈ మోసాలకు పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా ముమ్ముడివరం మండలంలోని నడిమిలంక గ్రామం అతని స్వస్థలగా పోలీసులు గుర్తించినట్లు కమీషనర్ తెలిపారు.నిందితుని వద్ద నుంచి రూ.8 లక్షల నగదు, నకిలీ డబుల్ బెడ్రూం మంజూరు పత్రాలు, ఐడీ కార్డులు, కారు, నకిలీ ఐడీ కార్డుల తయారీకి ఉపయోగిస్తున్న ల్యాప్టాప్, కలర్ ప్రింటర్, మొబైల్ ఫోన్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు.గతంలో నకిలీ ఐడీ కార్డులతో ఎస్సైగా చలామణి అయిన ఆ వ్యక్తిని విజయవాడలో పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో ఎస్సైగా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటూ టోల్ గేట్ ఫీజు చెల్లించకుండా విజయవాడకు వెళ్లాడు. పోలీసులు ఐడీని పరిశీలించగా నకిలీదని తేలడంతో జూన్ 24న అరెస్టు చేశారు.




తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







