కువైట్:ఆన్ లైన్ క్లాసుల వేళ ల్యాబ్ టాప్ ధరల పెంపుపై ప్రభుత్వం ఆగ్రహం

- September 23, 2020 , by Maagulf
కువైట్:ఆన్ లైన్ క్లాసుల వేళ ల్యాబ్ టాప్ ధరల పెంపుపై ప్రభుత్వం ఆగ్రహం

కువైట్ సిటీ:ప్రస్తుత కోవిడ్ పరిస్థితులతో ఎలక్ట్రానిక్ వస్తువులకు అమాంతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటం, విద్యా సంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండటంతో ల్యాబ్ టాప్ ల అవసరం పెరిగిపోయింది. అయితే..ఇదే అదనుగా కొందరు ఎలక్ట్రానిక్ డీలర్లు ప్రజలను దోచుకునే పనిలో పడ్డారు. అడ్డదారుల్లో లాభం పొందెందుకు ధరలను అసాధారణంగా పెంచేశారు. కంప్యూటర్ డీలర్ల వ్యవహారంపై దృష్టి సారించిన వాణిజ్య మంత్రిత్వ శాఖ అడ్డగోలుగా ధరల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కంప్యూటర్ డీలర్ల గోడౌన్లపై తనిఖీలు చేపట్టింది. ఓ కంప్యూటర్ డీలర్ మార్కెట్ పై గుత్తాధిపత్యం చలాయించి అధిక ధరలకు కంప్యూటర్ డివైజ్ లు అమ్ముకునే కుట్రతో 150 ల్యాబ్ టాప్ లను గోడౌన్లోనే బ్లాక్ చేసినట్లు మంత్రిత్వశాఖ తమ తనిఖీల్లో గుర్తించింది. ఒకే రోజు రెండు సార్లు గోడౌన్లో తనఖీలు చేపట్టిన అధికారులు ల్యాబ్ టాప్ లను బ్లాక్ చేసిన గోడౌన్ ను సీజ్ చేశారు. తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు కేసును సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. ఓ వైపు కరోనా సంక్షోభంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్న సమయంలో ఇలా అసంబద్ధంగా, అకారణంగా కంప్యూటర్ రేట్లను పెంచటం క్షమార్హం కాదని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రతి ఒక్క డీలర్ ను వినియోగదారుల చట్టం నిబంధనల మేరకే వ్యాపారం చేయాలని, అంతేగానీ ఇష్టానుసారంగా ధరలను పెంచితే చూస్తు ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చింది. ఇకపై ఎవరైనా నిర్ణీత ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్మితే హాట్ లైన్ 135కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పౌరులు, ప్రవాసీయులను మంత్రిత్వ శాఖ కోరింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com