టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం..

- August 23, 2021 , by Maagulf
టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం..

హైదరాబాద్: టీడీపీ ముఖ్యనేతలతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు.. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరల పెంపును నిరసిస్తూ శనివారం నిరసన కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లుల చెల్లింపు విషయంలో 413 కోట్లు డిపాజిట్‌ చేశామని చెబుతున్నా.. అవి కాంట్రాక్టర్లకు అందలేదని విమర్శించారు చంద్రబాబు. కేంద్రం 1991 కోట్లు నరేగా బకాయిలు విడుదల చేసినా వాటిని ఇవ్వకుండా దారిమళ్లించడం కోర్టు ధిక్కరణేనన్నారు. అత్యాచారాలు, హత్యలు, అట్రాసిటీ చట్టం దుర్వినియోగంపై టీడీపీ తరపున జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఇస్తామన్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు మొత్తం నగదు ఇవ్వాలని సమావేశంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను అండర్‌ వాల్యూకి ధారాదత్తం చేయకూడదన్నారు.. నాసిరకం మద్యంతో పాటు ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలోనూ పన్నులు, ధరలు పెంచి వేలకోట్ల భారాలు ప్రజలపై మోపారన్నారు. తెచ్చిన రెండు లక్షల కోట్ల అప్పు ఏం చేశారని ప్రశ్నించారు చంద్రబాబు.. అవినీతి, దుబారా వల్ల రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చిందన్నారు. జగన్‌ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించి వేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి పొందారన్నారు.. జగన్‌ రెడ్డి మోసాలను రెండేళ్లలోనే ప్రజలు గహించారన్నారు చంద్రబాబు. సరైన సమయంలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com