అబుధాబి లో జస్టిస్ రమణ..ప్రవాసీయులతో 'మీట్ & గ్రీట్'

- March 17, 2022 , by Maagulf
అబుధాబి లో జస్టిస్ రమణ..ప్రవాసీయులతో \'మీట్ & గ్రీట్\'

యూఏఈ: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సతీసమేతంగా యూఏఈ విచ్చేయటం జరిగింది. "ఆర్బిట్రేషన్ ఇన్ ది ఎరా అఫ్ గ్లోబలైజేషన్" పేరిట మార్చి 19న దుబాయ్ లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే నిమిత్తం సీజేఐ దంపతులు దుబాయ్ విచ్చేసిన సంగతి తెలిసిందే.

నేడు యూఏఈ రాజధాని అబుధాబి లోని 'ఇండియన్ సోషల్ క్లబ్ (ISC)' సీజేఐ దంపతులకు సన్మాన సభ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో యూఏఈ భారత రాయబారి సంజయ్ సుధీర్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లీ, సందీప్ కుమార్ బయ్యపు (డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్, అబుధాబి), యోగేష్ ప్రభు (ISC ప్రెసిడెంట్), రాజు (జనరల్ మేనేజర్ ), రాజా శ్రీనివాస్ (సెక్రటరీ) తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంజయ్ సుధీర్ మాట్లాడుతూ "యూఏఈ విచ్చేసిన మొదటి చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. యూఏఈ లో నివసిస్తున్న భారతీయుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా పలు సమస్యలకు న్యాయపరమైన చక్కటి సలహాలు కూడా మాకు ఇచ్చారు." అని అన్నారు.

సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లీ మాట్లాడుతూ "విదేశాల్లో ఇలా ఒక అస్సోసియేషన్ ను ఏర్పాటు చేసి భారత ప్రవాసీయులకు అండగా ఉంటూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిచటం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో విచ్చేసిన మహిళలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. హోలీ కళ సంతరించుకుంది" అని అందరికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.  


జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ "దేశం కాని దేశంలో ఇలా ఒక అసోసియేషన్ ను నెలకొల్పి భారతీయులకు అండగా ఉండటం చూస్తుంటే ఆనందంగా ఉంది. భారత సంస్కృతిని కాపాడేందుకు ISC చూపుతున్న చొరవ హర్షణీయం. ఇండియా-యూఏఈ మధ్య జ్యూడిషియల్ పరంగా పలు ఒప్పందాలను చేసుకునేందుకు యూఏఈ ప్రధాన న్యాయమూర్తి సానుకూలంగా స్పందించటం జరిగింది. జైల్లో చిక్కుకున్న భారతీయులను భారత్ కు పంపించేందుకు, జైళ్లల్లో శిక్షను అనుభవిస్తున్న భారతీయులను కలిసేందుకు భారత రాయబారికి ప్రత్యేక అధికారాలు మంజూరు చేయవలసిందిగా కోరటం జరిగింది. అంతేకాకుండా, అరబిక్/ఇంగ్లీష్ అర్ధంకాక ఇబ్బందిపడుతున్న ఖైదీలకు భాషా అనువాదులు ఉండేలా చూడాలని న్యాయశాఖ మంత్రిని కోరటం జరిగింది. న్యాయశాఖ మంత్రి సానుకూలంగా స్పందించటం ఆనందాన్ని కలిగించింది." అని అన్నారు.

"భారత్ లో ఎటువంటి ఆపదలు వచ్చినా..మేమున్నామంటూ ముందుగా గల్ఫ్ వాసులు ముందుకు రావటం చుస్తే మీకు భరత్ పై ఉన్న బాధ్యత మరియు మమకారం అర్ధం అవుతుంది అని కేరళ వరదల సమయంలో కేరళ ప్రవాసీయుల సహాయాన్ని ఈ సందర్భంగా సీజేఐ గుర్తుచేసుకున్నారు.. ఏ దేశంలో ఉన్నా, మన దేశ సంస్కృతీ సాంప్రదాయాలను తప్పక పాటించాలి. మాతృభాషను మరువరాదు.ప్రవాసీయులకు అన్ని న్యాయపరమైన సలహాలు/సహాయాం అందించేందుకు భారత లీగల్ కౌన్సిల్ సిద్ధంగా ఉటుందని భరోసా ఇస్తున్నాను" అని సీజేఐ ప్రసంగించారు.

తదుపరి ISC సభ్యులు..జస్టిస్ రమణ దంపతులకు గౌరవ సన్మానం చేశారు. భారత రాయబారి సంజయ్ సుధీర్ మెమెంటో తో సీజేఐ ను సత్కరించారు. హిమ కోహ్లీ ను ISC వైస్ ప్రెసిడెంట్ సన్మానించగా శ్రీమతి రమణ ను ISC ట్రెజరర్ సన్మానించటం జరిగింది. అంతేకాకుండా, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులు జస్టిస్ రమణ కు ఆప్యాయ సత్కారం అందిచడం జరిగింది.

అనంతరం ISC నిర్వహించిన విందులో పాల్గొని ప్రవాసీయులతో జస్టిస్ రమణ  ముచ్చటించారు.

    -- సౌమ్య చిత్తర్వు, స్పెషల్ కరెస్పాండంట్, మాగల్ఫ్,యూఏఈ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com