హైదరాబాద్ లో భారతదేశపు తొలి గోల్డ్ ఏటీఎం

- December 04, 2022 , by Maagulf
హైదరాబాద్ లో భారతదేశపు తొలి గోల్డ్ ఏటీఎం

హైదరాబాద్: ఏటీఎం అంటేనే డబ్బు విత్‌డ్రా చేయడం గుర్తుకు వస్తుంది. అయితే ఇప్పుడు బంగారం కూడా డ్రా చేసుకోవచ్చు. ఏంటి బంగారం ఏటీఎం నుంచి డ్రా అనే అనుమానమే వద్దండోయ్.

మీరు విన్నది నిజమే… దేశంలోనే తొలిసారిగా మన హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎం ఏర్పాటైంది. అంతేకాదు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో త్వరలో మరిన్ని ఏర్పాటు చేయనున్నారు. గోల్డ్ ఏటీఎం లో ఇప్పుడు వినియోగదారులు తమ డెబిట్ , క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఏటీఎం నుండి స్వచ్ఛమైన బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్‌లోని బేగంపేటలోని రఘుపతి ఛాంబర్స్‌లో మొదటి గోల్డ్ ఏటీఎంను ప్రారంభించారు. బంగారు ఏటీఎం కేంద్రాన్ని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. వినియోగదారులు 0.5 గ్రాముల నుండి 100 గ్రాముల వరకు బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు వారి స్వచ్ఛత బరువును తెలిపే ధృవీకరణ పత్రాన్ని కూడా పొందుతారు. గోల్డ్ ఏటీఎంలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్‌, సికింద్రాబాద్‌, అబిడ్స్‌తోపాటు పెద్దపల్లి, కరీంనగర్‌, వరంగల్‌లో గోల్డ్‌ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

గోల్డ్ ఏటీఎంల ఏర్పాటు గురించి గోల్డ్ సిక్కా సీఈవో సయ్యద్ తరుజ్ మాట్లాడుతూ… ‘ఈ బంగారు నాణేల ద్వారా 99.99 శాతం నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు మేం జారీ చేసిన ప్రీపెయిడ్ కార్డులను కూడా వినియోగించుకోవచ్చు’ అని తెలిపారు. కాగా, ఈ మిషన్లలో రూ. రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల ముడిసరుకు లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏటీఎంలు ఉదయం 9.50 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అనంతరం మరిన్ని ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని సయ్యద్ తెలిపారు. పాతబస్తీ, సికింద్రాబాద్‌, అబిడ్స్‌లో మూడు ఏటీఎంలతో పాటు పెద్దపల్లి, వరంగల్‌, కరీంనగర్‌లో గోల్డ్‌ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 3,000 ఏటీఎంలు తెరవనున్నారని ఆయన వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com