ఊమెన్ చాందీకి సంతాపం తెలిపిన బహ్రెయిన్‌లోని ప్రవాసులు

- July 19, 2023 , by Maagulf
ఊమెన్ చాందీకి సంతాపం తెలిపిన బహ్రెయిన్‌లోని ప్రవాసులు

బహ్రెయిన్: కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ మృతితో బహ్రెయిన్‌లోని ప్రవాసులలో తీవ్ర విషాదం నెలకొంది. బహ్రెయిన్‌కు చెందిన ఓవర్సీస్ ఇండియన్ కల్చరల్ కాంగ్రెస్ (OICC) ప్రస్తుత అధ్యక్షుడు బిను కున్నంతనం, మాజీ అధ్యక్షుడు రాజు కల్లుంపురం, ఇతర సభ్యులు సంతాపం తెలియజేశారు.  

కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన చాందీ దక్షిణ భారతదేశంలోని బెంగళూరులోని చిన్మయ ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున 4.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. 79 ఏళ్ల ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

జూన్ 2013లో వివిధ దేశాల ప్రతినిధులు హాజరైన బహ్రెయిన్ నేషనల్ థియేటర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో UN అండర్ సెక్రటరీ జనరల్ వు హాంగ్బో నుండి చాందీ యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ అవార్డ్ ఫర్ పబ్లిక్ సర్వీస్ అందుకున్నారు. బహ్రెయిన్‌లో ఉండగా మూడు రోజుల్లో 35 కార్యక్రమాల్లో చాందీ పాల్గొన్నారు. అప్పుడు తనను చూసేందుకు వచ్చిన జనంతో రద్దీ నెలకొంది. అవార్డు ప్రదానోత్సవానికి హాజరైనప్పుడు బహ్రెయిన్ లో ఆయన పాపులారిటీ స్పష్టంగా కనిపించిందరి ప్రవాసులు గుర్తుచేసుకున్నారు. దాదాపు 80 దేశాలకు చెందిన నాయకులు, ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చాందీ చేపట్టిన కార్యక్రమాలను ఐక్యరాజ్యసమితి గుర్తించి గౌరవించింది. ఆయన తీసుకున్న కార్యక్రమాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించింది. 2013 కార్యక్రమంలో  బహ్రెయిన్ ఉప ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ ముబారక్ అల్ ఖలీఫా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బహ్రెయిన్ మాజీ రవాణా మంత్రి కమల్ బిన్ అహ్మద్ మహమ్మద్ కూడా యూఎన్ అవార్డును అందుకున్నారు. 2017లో బహ్రెయిన్ లో పర్యటనకు వచ్చిన చాందీ ఎంతో నిరాడంబరంగా వ్యవహరించారని బహ్రెయిన్ నివాసి రాజు కల్లుంపురం గుర్తుచేసుకున్నారు.

కేరళలోని కొట్టాయం జిల్లాలోని పుత్తుపల్లి నియోజకవర్గానికి ఊమెన్ చాందీ 50 ఏళ్లకు పైగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన పుత్తుపల్లి నుంచి శాసనసభ సభ్యుడిగా (ఎమ్మెల్యే) ప్రాతినిధ్యం వహించారు. 1970లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాందీ తొలిసారిగా పుత్తుపల్లికి ప్రాతినిధ్యం వహించారు. 1977లో కె. కరుణాకరన్ కేబినెట్‌లో తొలిసారిగా మంత్రి అయ్యాడు.. రెండుసార్లు ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక శాఖను ఆయనే నిర్వహించారు. ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. చాందీ తన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల ఫిర్యాదులను వినేందుకు ప్రారంభించిన "జనసంబర్క పరిపాడి" అనే కార్యక్రమం ఎంతో ప్రజాదరణ పొందింది. ఊమెన్ చాందీకి భార్య మరియమ్మ, పిల్లలు మరియా ఊమెన్, చాందీ ఊమెన్,  అచ్చు ఊమెన్ ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com