మహిళల జోలికి వెళ్ళితే కఠిన చర్యలు

- June 19, 2016 , by Maagulf
మహిళల జోలికి వెళ్ళితే కఠిన చర్యలు

మహిళలను వేధిస్తున్న ఒక వ్యక్తిపై రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా షీ టీమ్స్ పీడీ యాక్టును ప్రయోగించాయి. షీ టీమ్స్ పనితీరు, మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నారనే విషయాలపై నగర అదనపు కమిషనర్ స్వాతి లక్రా ఒక నివేదికను విడుదల చేశారు. నగరంలోని 76శాతం మందికిపైగా ప్రజలకు షీ బృందాలు దగ్గరయ్యాయని, ఒక స్వచ్ఛంద సంస్థ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయని ఆమె వివరించారు.
ఈవ్‌టీజింగ్, మహిళలను వేధిస్తూ షీ టీమ్స్‌కు ఇప్పటివరకు 548మంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారన్నారు. 1800 ఫిర్యాదులు అందాయని, అందులో నేరుగా వచ్చినవారితో పాటు డయల్ 100, ఫేస్‌బుక్, వాట్సాప్, ఈ-మెయిల్స్ నుంచి వచ్చిన ఫిర్యాదులున్నాయని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో మహిళలను వేధించేవారిని ట్రేస్ చేసి పట్టుకుంటున్నామన్నారు. షీటీమ్స్‌తో చాలావరకు మార్పు వచ్చిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, నిందితులపై నమోదు చేసిన కొన్ని ప్రధాన కేసుల వివరాలను ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. -ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రంజిత్(30) హైదరాబాద్‌లో వృత్తి రీత్యా కూలీగా పనిచేస్తున్నాడు. తన సెల్‌ఫోన్లో నుంచి మహిళలకు అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు పంపిస్తూ వేధిస్తున్నాడు. బాధితుల కుటుంబ సభ్యులు వారించి, మందలించినా తన ప్రవర్తన మార్చు కోకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతనిపై మియాపూర్‌లో రెండుకేసులు, ఎస్‌ఆర్‌నగర్‌లో ఒక కేసు నమోదైంది. ఫోన్‌కాల్స్‌ను విశ్లేషించడంతో చాలామంది మహిళలను ఇలా వేధిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, పీడీ యాక్టును ప్రయోగించారు. షీ టీమ్స్ ఏర్పాటైన తరువాత మొదటిసారిగా ఫోన్లలో వేధించే వ్యక్తిపై పీడీ యాక్టు ప్రయోగించారు.-సాప్ట్‌వేర్ ఉద్యోగం చేసే ఒక యువకుడు తనతో పాటు ఉద్యోగం చేసే సహాద్యోగురాలిని పెళ్లి చేసుకోమంటూ వేధించాడు. దుబాయ్‌కి చెందిన యువతి హైదరాబాద్‌లోఉద్యోగం చేసేది. ఆమె తల్లిదండ్రులు అతనితో వివాహనికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఈ విషయాన్ని యువకుడికి చెప్పి ఉద్యోగం పనిమీద దుబాయ్‌కి తిరిగివెళ్లింది. అయితే ఆమెను ఈమెయిల్స్, స్కైప్‌లలో వేధిస్తూ, హైదరాబాద్‌కు రాకపోతే గతంలో దిగిన ఫొటోలను నెట్‌లో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడు. హైదరాబాద్‌కు వచ్చేందుకు దుబాయ్ నుంచి టిక్కెట్లు బుక్ చేసి, బలవంతంగా ఇక్కడకు రప్పించి, ఆమెను ఒక గదిలో నిర్బంధించాడు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ విషయంపై యువతి సోదరుడు హైదరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో ఆమెను రక్షించి, యువకుడిని జైలుకు పంపించారు.-ఢిల్లీకి చెందిన ఒక మహిళ గచ్చిబౌలిలో ఒక కార్యక్రమానికి వచ్చింది. ఆ సమయంలో అభిషేక్ అనే ఒక న్యాయవాది, అతని ఇద్దరు స్నేహితులు ఆమెకు తాము మీడియా పర్సన్స్ మంటూ పరిచయం చేసుకున్నారు. ఆమె విజిటింగ్ కార్డు తీసుకొని, ఫోన్లలో వేధిస్తున్నారు. రాత్రి పగలనకుండా ఆమె ఫోన్‌కు అసభ్యకరమైన మేసేజ్‌లు పెడుతున్నారు. ఢిల్లీకి వెళ్లినా ఫోన్లలో వీరి వేధింపులు ఆగలేదు. దీంతో ఆమె ఈమెయిల్ ద్వారా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. తరువాత నేరుగా వచ్చి జరిగిన విషయాన్ని షీ టీమ్స్‌కు చెప్పడంతో న్యాయవాదిని అరెస్ట్ చేశారు.-సోషల్ మీడియాలో స్నేహితులైన మహిళలను ఫొటోలు తీసుకొని వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఎండీ వాసిమ్, షేక్ నిజాముద్దీన్‌లను అరెస్ట్ చేశారు. ఫోన్లలో మహిళలను వేధించిన మసియుద్దీన్, చింతల రమేష్, షేక్ జహీర్, అబ్దుల్ సలీంలను జైలుకు పంపారు.స్కూల్‌లో తాత అసభ్య ప్రవర్తన.. పోసో చట్టం కింద కేసు బి.విశ్వనాథం రిటైర్డు గవర్నమెంట్ ఉద్యోగి. ప్రతి రోజు తన మనుమరాలిని స్కూల్‌లో దింపి, సాయంత్రం తీసుకువస్తుంటాడు. ఈ క్రమంలో స్కూల్‌లో అతని మనుమరాలి స్నేహితురాళ్లను, ఆమె క్లాస్‌మేట్స్‌ను కావాలని తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. పదేళ్ల బాలిక ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఆ పాప కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. స్కూల్‌లో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, విశ్వనాథం చేసిన చేష్టలకు షాక్ తిన్న స్కూల్ యజమాన్యం షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై ఐపీసీ 354-ఎ, సెక్షన్ 8 ఆఫ్ పీఓఎస్‌ఎస్‌ఓ(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్స్‌వల్ అఫెన్సన్స్) యాక్టు 2012 కింద కేసు నమోదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com