ప్రైవేట్ టీచర్లకు గోల్డెన్ వీసా.. ప్రకటించిన దుబాయ్..!!

- October 06, 2024 , by Maagulf
ప్రైవేట్ టీచర్లకు గోల్డెన్ వీసా.. ప్రకటించిన దుబాయ్..!!

యూఏఈ: దుబాయ్ ప్రైవేట్ విద్యా రంగానికి విశేష కృషి చేసిన అధ్యాపకులకు గోల్డెన్ వీసాలు ఇవ్వనున్నట్లు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా షేక్ హమ్దాన్ Xలో ఈ మేరకు తెలిపారు.  దుబాయ్ ప్రైవేట్ విద్యా రంగానికి విశేష కృషి చేసిన అధ్యాపకులకు గోల్డెన్ వీసా మంజూరు చేయాలని తాము ఆదేశాలు జారీ చేసామన్నారు. యువకులను తీర్చిదిద్దడంతో టీచర్ల పాత్ర విలువ కట్టలేనిదన్నారు.   అకడమిక్ ఎక్సలెన్స్, విద్య నాణ్యతను మెరుగుపరచడంలో అందించిన సహకారం, విద్యార్థులు మెరుగైన విద్యా ఫలితాలు, గుర్తింపు పొందిన గ్రాడ్యుయేషన్ అర్హతలను సాధించడంలో టీచర్ల ప్రయత్నాలపై ఆధారపడి వారికి గోల్డెన్ వీసాను మంజూరు చేయనున్నారు. దుబాయ్ ప్రతిభావంతులైన అధ్యాపకులను ఎమిరేట్‌కు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుందని, భవిష్యత్ తరాల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడేలా విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అక్టోబరు 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్.. దేశంలోని విద్యావేత్తలు అందిస్తున్న కృషిని ప్రశంసించి, కృతజ్ఞతలు తెలిపారు.  ఫిబ్రవరి 28ని ఎమిరాటీ విద్యా దినోత్సవంగా జరుపుకుంటామని షేక్ మొహమ్మద్ గతంలో ప్రకటించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com