సంఘ్ నిర్మాణకర్త-గురూజీ గోళ్వల్కర్
- February 18, 2025
భారతదేశ రాజకీయాలను 3 దశాబ్దాలు ప్రభావితం చేసిన వ్యక్తి అతను.ఎటువంటి ఉన్నతమైన పదవులు చేపట్టకుండానే, భారత రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. జాతీయ సమైక్యత కోసం అహర్నిశలు శ్రమించి , భారత జాతీయత, సంస్కృతి-పరంపరలు ఆధారంగా భారత జాతిలో నవచైతన్యాన్ని నింపడమే కాకుండా, జాతికి యోగ్యమైన దిశను చూపి నడిపించిన యోధుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘచాలక్ గురూజీ గోళ్వల్కర్.
గురూజీగా ప్రసిద్ధిపొందిన మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్ 1906, ఫిబ్రవరి 19వ తేదీన నాగ్పూర్ సమీపానగల రాంటెక్ పట్టణంలో సదాశివరావు, లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచి ఎంతో తెలివైన విద్యార్థి కావడంతో చదువుల్లో బాగా రాణించారు. జంతుశాస్త్రంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాశీలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసారు.
అనంతరం, బెనారస్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా కొంత కాలం పనిచేశారు. అధ్యాపకుడిగా విద్యార్థుల్లో ఆయనకు మంచి పేరు ఉండేది. విద్యార్థులు ఆయన్ని "గురూజీ" గౌరవంగా సంభోదించేవారు. విద్యాలయంలో పనిచేస్తున్న సమయంలోనే ఆయన అక్కడ అనేక విషయాలు అధ్యయనం చేశారు. దేశంలో జరుగుతున్న ఉద్యమాలు, సామాజిక మార్పుకై జరుగుతున్న ప్రయత్నాలు, పెరుగుతున్న ఇస్లాం దాడులు అన్ని విషయాలపై అధ్యయనం సాగేది. 1930 సంవత్సరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్జీగా ప్రసిద్ధుడైన కేశవ్ బలీరాం హెడ్గేవార్ ను కలవడం జరిగింది. వారిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి.
గురూజీ మీద డాక్టర్జీకి మంచి గురి కుదరటంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లోని ఆహ్వానించడం, కొన్ని కారణాల రీత్యా ఆయన చేరలేదు. నాగ్పూర్ తిరిగొచ్చి న్యాయశాస్త్ర పట్టభద్రులయ్యారు. అయితే, నాగ్పూర్ పట్టణంలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంతో ఏర్పడ్డ సన్నిహిత సంబంధాలు ఆయన్ని సన్యాసం తీసుకోవడానికి ప్రేరేపించాయి. సంవత్సరం పాటు ముర్షిదాబాద్ జిల్లాలోని సారగాచి ఆశ్రమంలోని స్వామి అఖండానంద శిష్యరికంలో గడిపారు. అఖండానంద ఆదేశాల మేరకు తిరిగి నాగ్పూర్ చేరుకున్నారు.
1937లో డాక్టర్జీ కోరిక మేరకు సంఘంలో చేరారు. డాక్టర్జీ ఆధ్వర్యంలో గురూజీ సంఘం కోసం పనిచేస్తూ స్వయంసేవక్ శిక్షణ తరగతులు నిర్వహించారు. డాక్టర్జీ ఆకస్మిక మరణం కారణంగా ఆయన వారసుడిగా 1940లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘచాలక్గా బాధ్యతలు స్వీకరించారు. 1940-73 వరకు 33 సంవత్సరాలు సంఘాన్ని నడిపిస్తూ సంఘ కార్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు.
దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విస్తరించేందుకు గురూజీ కీలకమైన పాత్ర పోషించారు. ఆర్ఎస్ఎస్ ద్వారా భారతదేశ రాజకీయాల్లో సైతం కీలకంగా వ్యవహరించారు.1948లో గాంధీజీ హత్యతో ప్రేమయం ఉందనే నెపంతో గురూజీని అరెస్ట్ చేయడంతో మొదలైన ఆయన రాజకీయ జీవితం, బిజెపి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేయడంతో పాటుగా తన వ్యూహాలతో విపక్ష పార్టీలతో కలిసి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం జరిగింది. దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన తోలి తరం రాజకీయ నాయకుల్లో వీరు ఒకరు.
దేశ సమైక్యత కోసం అందరు కలిసి కృషి చేయాలని గురూజీ ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచేవారు. అస్పృశ్యత, అంటరానితనం అనేవి.. సవర్ణులుగా పిలువబడే హిందువులలో మేము పెద్ద కులంలో జన్మించామనే అహంకార భావన.. వీటిని పెద్దరాయిని క్రేన్తో తొలగించినట్లుగా సులభంగా తొలగించలేము. కావలసింది మానసిక పరివర్తన. ఆచార్యులైతే నూతన స్మృతినిచ్చారు. కాని ఈ సందేశం లక్షలాది గ్రామాలకు, నగరాలకు, ప్రతి ఇంటికీ, ప్రతి గుడిసెకూ, ప్రతి గుండెకు అందజేయవలసిన బాధ్యత కార్యకర్తలది అని వివరించారు.
సంస్కృతి అంటే భావాల్ని బహిర్గతం జేయడానికి అనువయ్యే కళల వంటిది కాదు, కళలవలన కలిగే ఫలితమూ కాదు. అది వివిధ సంస్కారాల సారం! వివిధ సంస్కారాల ప్రాతినిధ్య శక్తి అని గోళ్వల్కర్ సంస్కృతిని నిర్వచిస్తూ బోధన మానవుని ప్రవృత్తిని మార్చి ప్రవర్తనను అదుపులో ఉంచుతుందని పేర్కొన్నారు.
‘సంఘం సర్వసమానత్వాన్ని ఏర్పరచడానికి ప్రయత్నించడానికి ముందు మనతో నిరంతరం అంతస్స్రోతస్సుగా ప్రవహిస్తున్న ఐకమత్యాన్ని ప్రధానంగా తీసుకొని పనిచేస్తున్నది’ అని గోళ్వల్కర్ తన ఉపన్యాస సందర్భంలో పేర్కొన్నారు. దానికిగాను సంఘం భారతీయ సంస్కృతిని ఆధారం చేసుకుందనీ, అదే భారతవర్షంలోని ప్రతి వర్గాన్నీ కలుపుతున్న సూత్రమనీ ఆయన పేర్కొన్నారు.
సంఘము స్వయం సేవకులను తయారుచేస్తుంది. హిందూ సమాజాన్ని సంఘటితం (ఐక్యం) చేస్తుంది. స్వయంసేవకులు సమాజంలో జాతిని ప్రేమించే వ్యక్తులతో కలసి, సమూహంగా ఏర్పడి -జాతి సర్వాంగీణ వికాసానికి తోడ్పడుతున్నారు. పూజ్య శ్రీ గురూజీ తమ తపశ్శక్తితో, నిరంతర కృషితో, దూరదృష్టితో, నిశిత పరిశీలనతో, సమగ్రమైన యోజనతో యోగ్యమైన కార్యకర్తలను జాతీయ జీవనంలో పనిచేయడానికి మార్గదర్శనం చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూ సమాజపు జాతీయ స్వరూపాన్ని గుర్తించి, హిందూ సమాజంలోని ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తిని, జాతీయ నిష్ఠను జాగృతం చేసే ప్రయత్నం చేస్తుంది. దేశసేవ కొరకు సర్వసార్పణ చేయగల శీలసంపన్నమైన జీవితం గడుపుతూ దానికి అనుగుణంగా గుణాలను వికసింపజేసుకొనేలా ప్రయత్నిస్తుంది.అందరిలోను సామాజిక భావాలను జాగృతం చేసే ప్రయత్నం చేస్తుంది. ఆసేతు హిమాచల ఏకరూప, సమరసపూర్ణ, ఏకాత్మ సమాజజీవనాన్ని, జాతీయ జీవనాన్ని ప్రతిష్టించే ప్రయత్నం చేస్తుందని శ్రీ గురూజీ అనేక మార్లు ఉద్ఘాటించారు.
తన ప్రసంగాలతో భారత జాతిని ఉర్రూతలూపిన శ్రీ గురూజీ, తన నడవడితో, తన కార్యశైలితో సంఘానికి అద్వితీయ రీతిలో పథ నిర్దేశం చేశారు. భారతీయ సాంస్కృతిక జీవనానికి వ్యతిరేకమైన విదేశీ సిద్ధాంతాలు, జాతీయ భావనలు వ్యతిరేకిస్తూ, స్వైర విహారం చేస్తున్న సమయంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచిన మహనీయుడైన గురూజీ 1973, జూన్ 4వ తేదీన తుది శ్వాస విడిచారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







