పాక్ స్వాతంత్ర్య వేడుకల్లో అపశ్రుతి…కాల్పులతో ముగ్గురి మృతి
- August 14, 2025
పాకిస్థాన్: పాకిస్థాన్లో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాల్సింది ఓ ఆనందదాయక వేడుక. కానీ ఈసారి కరాచీలో అది విషాదాన్ని మిగిల్చింది. ఆగస్ట్ 14 రాత్రి, వేడుకల మద్య కొందరి నిర్లక్ష్యంగా జరిపిన గాల్లోకి తుపాకీ కాల్పులు అనేక కుటుంబాలపై కన్నీటి ముద్ర వేసాయి. ఎనిమిదేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. ఇంకా 60 మందికి పైగా గాయాలపాలయ్యారు.అర్ధరాత్రి దాటాక, కరాచీ వీధుల్లో బాణసంచా చప్పుళ్లు, తుపాకీ శబ్దాలతో హడావుడిగా మారిపోయింది. ఆనందం చూపించేందుకు చేపట్టిన ఈ కాల్పులు చివరకు అమాయకులపై బుల్లెట్లుగా మారాయి.అజీజ్ బ్లాక్–8లో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. తుపాకీ తూటా ఆమెకు బలంగా తాకడంతో, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయింది. కోరంగి ప్రాంతంలో స్టీఫెన్ అనే వ్యక్తి కాల్పుల్లో మరణించాడు. మరో వృద్ధుడూ ఇటువంటి ఘటనలో ప్రాణాలు విడిచినట్లు అధికారులు చెప్పారు.
ఈ కాల్పుల వల్ల మొత్తం 64 మంది గాయపడినట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపారు. వారిలో చాలామందికి బుల్లెట్ గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరాచీలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. పలువురి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. లియాఖతాబాద్, లయారి, నార్త్ నాజిమాబాద్, కోరంగి వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఘటనలు నమోదయ్యాయి.గాల్లోకి తుపాకీ కాల్పులు జరిపే ఈ తత్వం పాకిస్థాన్లో ఎన్నో సంవత్సరాలుగా కనిపిస్తోంది. కానీ ఈసారి ఫలితాలు దారుణంగా మారాయి. పోలీసులు, అధికారులు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. “ఇది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ప్రజలు బలమైన, సురక్షితమైన మార్గాల్లో సంబరాలు జరుపుకోవాలి,” అని హెచ్చరించారు.
ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు నగరవ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఇప్పటివరకు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి తుపాకులు, బుల్లెట్లు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసులను నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.దేశభక్తి అర్థం తుపాకీ కాల్పులు కాదు. ఉత్సవాలను ఆనందంగా, బాధ్యతగా జరుపుకోవాల్సింది. కానీ నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తే – అది మరణాల సంబరంగా మిగిలిపోతుంది. పాకిస్థాన్ ప్రజలకు, ముఖ్యంగా కరాచీ నగరానికి ఇది ఒక గుణపాఠం కావాలి. స్వాతంత్ర్యం అంటే జీవితాన్ని గౌరవించడం. ప్రాణాలను కాపాడడమే నిజమైన జాతీయం.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్