వజీరాలాంగ్‌కార్న్‌ కి రాజు పదవి చేపట్టమని ఆహ్వానం...

- November 29, 2016 , by Maagulf
వజీరాలాంగ్‌కార్న్‌ కి రాజు పదవి చేపట్టమని  ఆహ్వానం...

తీవ్ర అనారోగ్యం కారణంగా థాయిలాండ్‌ రాజు భూమిబోల్‌ అదుల్యదేజ్‌ అక్టోబరు 13న కన్నుమూసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం పాలించిన ఆయన మరణంతో ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోగా అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడు థాయిలాండ్‌కు తదుపరి రాజును ఎంపిక చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. ప్రస్తుతం యువరాజుగా ఉన్న మహా వజిరాలాంగ్‌కోర్న్‌ను థాయిలాండ్‌ రాజుగా పదవి చేపట్టమని మంగళవారం అక్కడి పార్లమెంట్‌ ఆహ్వానించింది.
ఆ దేశ నేషనల్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్‌ పార్న్‌పెచ్‌ విచిత్‌చోల్‌చాయ్‌ ఆనవాయితీ ప్రకారం యువరాజును ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు.వెంటనే పార్లమెంటు సభ్యులంతా నిలబడి 'లాంగ్‌లివ్‌ ద కింగ్‌' అంటూ నినదించారు. ఈరోజు ఉదయం ముందుగా కేబినెట్‌ యువరాజు పేరును ప్రతిపాదించింది. డిప్యూటీ ప్రధాన మంత్రి ప్రావిత్‌ వాంగ్‌సువాన్‌ కొత్త రాజు బాధ్యతలు స్వీకరించేందుకు అవసరమైన ప్రక్రియ సంప్రదాయ నియమాల ప్రకారం అంచెలంచెలుగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పుడిక ప్రొటోకాల్‌ ప్రకారం అసెంబ్లీ స్పీకర్‌ యువరాజుతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో యువరాజును రాజుగా అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నట్లు సమాచారం. జర్మనీలో వీరి కుటుంబానికి ఆస్తులు ఉన్నాయి. దాంతో సంవత్సరంలో ఎక్కువ కాలం ఆయన అక్కడే గడుపుతుంటారు.సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన రెండో రాజుగా థాయిలాండ్‌ రాజు భూమిబోల్‌ అదుల్యదేజ్‌ నిలిచారు. అనారోగ్యం కారణంగా ఆయన అక్టోబర్‌ 13న కన్నుమూశారు. కుమారుడు 64 ఏళ్ల వజీరాలాంగ్‌కార్న్‌ని తన వారసుడిగా భూమిబోల్‌ నాలుగు దశాబ్దాల క్రితమే ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com