మరో 72 గంటల్లో.. గుజరాత్‌ తీరానికి ఓఖీ తుపాన్‌ ముప్పు..!

- December 03, 2017 , by Maagulf
మరో 72 గంటల్లో.. గుజరాత్‌ తీరానికి ఓఖీ తుపాన్‌ ముప్పు..!

గత నాలుగు రోజులుగా తమిళనాడు, కేరళలో విధ్వంసం సృష్టించిన ఓఖీ తుఫాను దిశ మార్చుకుంది. లక్షద్వీప్ దగ్గర కేంద్రీకృతమైన ఈ తీవ్ర తుపాను క్రమంగా బలహీనపడి గుజరాత్ తీరం వైపు కదులుతోంది. మరో 72 గంటల్లో ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ మధ్య తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అరేబియా సముద్రంలో ఓఖీ తుపాను ముప్పు ఇంకా పొంచి ఉంది. కేరళ, తమిళనాడులో నాలుగు రోజుల విధ్వంసం తర్వాత దిశ మార్చుకున్న ఓఖీ.. దక్షిణ గుజరాత్ మీద విరుచుకుపడేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఓఖీ తుపాను ముంబైకి 800 కిలోమీటర్ల దూరంలో, సూరత్‌కు 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీ కృతమై ఉంది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో దక్షిణ వాయవ్య దిశగా ముందుకు కదులుతోంది. 

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న గుజరాత్‌ను ముంచెత్తేందుకు ఇది తీరం వైపు పరుగులు తీస్తోంది. మరో 72 గంటల్లో ఇది దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరాలను తాకనుంది. మంగళవారం అర్థరాత్రి సూరత్ దగ్గర ఇది తీరం దాటవచ్చని వాతావరణ శాఖ భావిస్తోంది. తుపాను ప్రభావంతో 5, 6 తేదీల్లో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లో మోస్తరు నుంచి బారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. 

ఓఖీ తుపాను ప్రభావంతో ఇవాళ్టి నుంచి ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాలలో బలమైన గాలులు వీయనున్నాయి. ఆరో తేదీ వరకూ గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. నేటి నుంచి మరో మూడు రోజుల వరకూ తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తుపాను హెచ్చరికలతో గుజరాత్ అధికారులు అలర్టయ్యారు. వర్షాల వల్ల ఎన్నికలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. ఇటు వరదల వల్ల నష్టపోయిన కన్యాకుమారిలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. బాధితులను పరామర్శించారు

మరోవైపు కేరళలో మత్స్యకారులను కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. త్రివేండ్రం తీరంలో అరేబియా సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులు కొంతమందిని ఆర్మీ హెలికాప్టర్లు సహాయక చర్యలు చేపట్టాయి. మత్స్యకారులను అధికారులు హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com