ఏపీలో అగ్రికల్చర్‌ యూనివర్శిటీకి శంకుస్థాపన

- November 16, 2015 , by Maagulf
ఏపీలో అగ్రికల్చర్‌ యూనివర్శిటీకి శంకుస్థాపన

ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ పురుడుపోసుకుంటోంది. సీఎం, కేందమంత్రుల సమక్షంలో అగ్రికల్చర్‌ యూనివర్శిటీకి శంకుస్థాపన జరిగింది. వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాతక సంస్థకు పునాది రాయి పడింది. గుంటూరులోని లాంఫాంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేంద్రమంత్రి రాధామోహన్‌సింగ్ శంకుస్థాపన చేసి శిలాపలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి, మంత్రులు హాజరయ్యారు. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు అనివార్యమైంది. ఆచార్య ఎన్జీ రంగా పేరుతోనే ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసింది. వ్యవసాయరంగానికి పెద్దపీట : చంద్రబాబు వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్జీ రంగా వర్సిటీని జాతీయ వ్యవసాయ వర్సిటీగా మార్చాలని కేంద్రానికి సూచించినట్లు తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తామన్న చంద్రబాబు, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ పెంచామని చెప్పుకొచ్చారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని చంద్రబాబు అన్నారు. కరువు ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా రెయిన్ గన్స్ అందిస్తున్నట్లు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు వివిధ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయనికి పగటిపూటే కరెంట్‌ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కొత్త రాష్ట్రంలో అనేక కష్టాలున్నాయన్న చంద్రబాబు...5 నుంచి 10 ఏళ్లు కష్టపడితే కష్టాలన్నీ తీరిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి చుట్టూ రింగ్‌రోడ్డు : వెంకయ్యనాయుడు అమరావతి చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. దుర్గగుడి ప్లైఓవర్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. పోలవరాన్ని ఎందుకు నిర్మించిలేదో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలని వెంకయ్యనాయుడు డిమాండ్‌ చేశారు. హైలెట్‌గా నిలిచిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్ ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్ హైలెట్‌గా నిలిచాయి. సీఎంతో పాటు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర వీఐపీలు స్టాల్స్ ను తిలకించారు. వ్యవసాయ వర్సిటీ శంకుస్థాపన కోసం లాంఫాంలో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com