బురఖా వేసుకుని అమ్మాయితో హాస్టల్‌కి వెళ్లాడు..

- May 18, 2018 , by Maagulf
బురఖా వేసుకుని అమ్మాయితో హాస్టల్‌కి వెళ్లాడు..

తెలంగాణ:ప్రేమించాలంటే ధైర్యం అవసరంలేదు. ఎన్ని జిమ్మిక్కులు చేసైనా అమ్మాయి లేదా అబ్బాయిని వలలో పడేస్తారు. వారి కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా సిద్ధపడతారు. మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలం బూనీడు గ్రామానికి చెందిన సద్దాం హుసేన్ పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే యూనివర్శిటీలో చదువుతున్న తోటి విద్యార్థినితో కలిసి ఆమె ఉండే హాస్టల్‌కి బురఖా వేసుకుని వెళ్లాడు. అక్కడ ఉన్న సిబ్బందికి ఎటువంటి అనుమానం రాలేదు. వారిరువురు హాస్టల్ గదిలోకి వెళ్లిన తరువాత పక్క రూముల్లోని విద్యార్థినులకు విషయం తెలిసి వార్డెన్‌కు సమాచారం అందించారు. వార్డెన్ వచ్చి సద్దాంని మందలించి పర్మిషన్ లేకుండా లేడీస్ హాస్టల్‌కి వచ్చినందుకుగాను పనిష్‌మెంట్ ఇవ్వదలిచారు. సద్దాం వద్ద ఉన్న సెల్ ‌ఫోన్ తీసుకుని మర్నాడు ఉదయం వచ్చి తీసుకు వెళ్లమని చెప్పారు. మరోసారి ఇలాంటి పొరపాటు పని చేయనంటూ అతడి చేత లేఖ రాయించుకుని మరీ బయటకు పంపించారు. 

హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లాడే కానీ తెల్లారితే ఏమవుతుందో అని భయపడ్డాడు. పరువు పోతుందని ఆలోచించాడు. బతకడానికి ఏ మాత్రం ధైర్యం చాల్లేదు. ఈ ఆలోచనలతోనే నడుచుకుంటూ రైలు పట్టాల మీదకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం మహబూబ్ నగర్ శివార్లలో మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు పత్రికలకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చి కొడుకు సద్దాం మృతదేహాన్ని గుర్తించారు. కుమారుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుని హాస్టల్ సిబ్బందిని విచారించగా వారు ఏ మాత్రం స్పందించలేదు. ఈ మేరకు సమగ్ర దర్యాప్తు జరపాలని సద్దాం తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు. ఈ సంఘటనపై విచారణకు కమిటీ వేస్తామని సద్దాం చదువుతున్న యూనివర్శిటీ వీసీ రాజారత్నం తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com