విశాఖ వాసులకు శుభవార్త తీసుకొచ్చా : ప్రధాని మోదీ

- March 02, 2019 , by Maagulf
విశాఖ వాసులకు శుభవార్త తీసుకొచ్చా : ప్రధాని మోదీ

ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ.. విశాఖ వేదికగా జరిగిన సభలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై నేరుగా విమర్శలు చేశారు. భారత్‌ మాతాకీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. తరువాత తెలుగులో మాట్లాడి విశాఖ వాసుల్ని ఆకట్టుకున్నారు.

 
విశాఖ వాసులకు శుభవార్త తీసుకొచ్చానన్న ప్రధాని…విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. రైల్వే జోన్‌ రాకతో ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు మోదీ..

విశాఖ అభివృద్ధి కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మోదీ గుర్తు చేశారు. ఎయిర్‌పోర్ట్‌, 6 లైన్ల హైవే, ఆయిల్‌ రిఫైనరీ, ఐఐఎం, లాజిస్టిక్ హబ్‌.. వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను వందల కోట్లతో చేపట్టామన్నారు మోదీ.

ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రతి విషయంలోనే యూ టర్న్‌ తీసుకున్నారని.. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పదే పదే తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు..

దేశహితమే పరమావధిగా పనిచేసే ప్రభుత్వాన్ని దించాలని దేశంలో కొన్ని పార్టీలు కూటమి కట్టాయన్నారు మోదీ. మహా కూటమి పేరుతో కొంతమంది నేతలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

యావత్‌ ప్రపంచం పాకిస్థాన్‌ నుంచి జవాబు కోరుతుంటే.. దేశంలోని కొందరు మాత్రం సైనికుల మనో ధైర్యాన్ని దెబ్బతీసే ప్రకటనలు చేస్తున్నారంటూ పరోక్షంగా చంద్రబాబుపై విమర్శలు చేశారు.

దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే జై జవాన్‌.. జై కిసాన్‌ ఉంటుందన్నారు. రైతులకు ఏటా 6 వేల రూపాయలను సాయంగా అందిస్తున్నామని గుర్తిస్తున్నారు.ఇది కేవలం ఆరంభం మాత్రమే అని గుర్తించాలని మోదీ అన్నారు..

మొత్తంగా…విశాఖలో మోదీ సభ సక్సెస్‌ అయిందంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారని, మంచి రెస్పాన్స్‌ వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com