బ్రేకింగ్: మళ్ళీ టాలీవుడ్ డ్రగ్స్ కేసు టెన్షన్..రానా, రకుల్ కి సమన్లు జారీ

- August 25, 2021 , by Maagulf
బ్రేకింగ్: మళ్ళీ టాలీవుడ్ డ్రగ్స్ కేసు టెన్షన్..రానా, రకుల్ కి సమన్లు జారీ

హైదరాబాద్: సుమారు మూడున్నర ఏళ్ల క్రితం హైదరాబాద్ లో వెలుగుచూసిన భారీ డ్రగ్స్ వ్యవహారం ఎంత సంచలనం రేపింది అనేది దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణిస్తూ రవితేజ సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అప్పుడు ఆయన డ్రగ్స్ సేవించి ఉన్నారని అనుమానాలు పోలీసులు వ్యక్తం చేశారు.. ఆ దెబ్బతో టాలీవుడ్ మొత్తం మీద డ్రగ్స్ వ్యవహారం కలకలం రేగింది. కొందరు హీరోలను, హీరోయిన్లను నటులను ఎక్సైజ్ విభాగం విచారణకు పిలవడంతో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే గతంలో వీరికి క్లీన్ చిట్ ఇచ్చేశారని ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రచారం జరిగినా తాజాగా ఈ వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

మీడియా నుంచి మాయం
కొన్నాళ్ళ క్రితం టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులు పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేయడమే కాక వారిని రోజుల తరబడి విచారణ జరిపారు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ తర్వాత ఈ కేసు తీవ్రత మీడియాలోనూ పోలీస్ వర్గాల్లోనూ కనిపించకుండా పోయింది. అయితే ఆ మధ్య ఈ కేసు వ్యవహారం ఎంతవరకు వచ్చిందో చెప్పాలని అంటూ ఒక సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా కొన్ని వివరాలు కోరగా కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

వాళ్ళందరికీ క్లీన్ చిట్
సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం ఈ కేసులో ఉన్న సినీ ప్రముఖులు అలాగే ఇతరులకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు తేలింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థను స్థాపించిన పద్మనాభరెడ్డి అప్పట్లో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా దాని ప్రకారం వెల్లడైన వివరాల మేరకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు క్లారిటీ వచ్చింది. అప్పట్లో డ్రగ్స్ పంపిణీ చేస్తూ పట్టుబడిన కెల్విన్ అనే దక్షిణాఫ్రికా దేశానికి చెందిన వ్యక్తిని విచారిస్తే 62 మంది ప్రముఖుల పేర్లు వెల్లడి కాగా అందులో 11 మంది సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు.

ఆ సంస్థ వల్లే
అప్పట్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోలు రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్ నటులు సుబ్బరాజు, నందు సినిమాటోగ్రాఫర్ శ్యామ్.కె.నాయుడు రవితేజ పర్సనల్ డ్రైవర్ శ్రీనివాస్, హీరోయిన్ ఛార్మి, ముమైత్ ఖాన్ తదితరులను అప్పట్లో విచారణ కూడా జరిపారు. వీరి నుంచి శాంపిల్స్ కూడా తీసుకున్నారని రక్తం, గోళ్లు, వెంట్రుకల వంటి నమూనాలను సేకరించి టెస్ట్ కి పంపించగా అందులో ఎలాంటి ఆనవాళ్లు లేవని తేలినట్లు వెల్లడైంది. ఆ సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ కేసును కావాలని నీరుగార్చారని తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

రంగంలోకి ఈడీ
అయినా ఉపయోగం లేకపోవడంతో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా అటు సీబీఐ అధికారులు సహా ఈడీ అధికారులకు ఒక లేఖ రాశారట. ఈ లేఖ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు పంపారు. ఈ కేసులో సిట్ ఇచ్చిన నివేదిక, ఎక్సైజ్ శాఖ జరిపిన విచారణ వివరాలు ఈడీ అధికారులు పరిశీలించిన తర్వాత వీరికి సమన్లు జారీ చేసినట్లు సమాచారం.

రానా, రకుల్ పేర్లు ఎందుకు?
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే అయితే గతంలో విచారణకు హాజరైన వారిలో దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్ లేరు. కానీ అనూహ్యంగా బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ మరణం తర్వాత తెరపైకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు వినిపించింది. ఆమెతో పాటు మరికొంతమంది నటీమణుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి కానీ ఆమెకు మాత్రమే ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. మరి రానా పేరు ఎందుకు చేర్చారు అనేది తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com