కివీస్ జట్టు పై భారత్ విజయం తధ్యమేనా .. !

- March 09, 2025 , by Maagulf
కివీస్ జట్టు పై భారత్ విజయం తధ్యమేనా .. !

దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లు సిద్దమయ్యారు.  ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ 2025  లో ఇప్పటికే అద్భుతంగా ఆటతీరుతో ఫైనల్ కు చేరుకున్న ఇరుజట్లు టైటిల్ కు కేవలం అడుగుదూరంలో నిలిచాయి. ఆసక్లికరమైన విషయం ఏంటంటే 25 ఏళ్ల తర్వాత భారత్-న్యూజిలాండ్ జట్లు ఒక వైట్ బాల్ టోర్నమెంట్ ఫైనల్‌లో తలపడబోతున్నాయి. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి న్యూజిలాండ్ ఫైనల్‌కి చేరగా, ఆసీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టీమిండియా ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

ఈ రెండు జట్లు చివరిసారిగా 2000 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడ్డాయి. అయితే అప్పుడు న్యూజిలాండ్ విజయం సాధించి తొలి ఐసిసి టైటిల్ అందుకుంది. అయితే సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఐసిసి ఛాపింయన్స్ ట్రోఫీలో ఇండియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి... మరి   ఈసారి భారత్ రివేంజ్ తీర్చుకుంటుందా? లేక మరోసారి కివీస్ విజేతగా నిలిచిపోతారా? అనేది ఈరోజు తేలనుంది.

ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఇది... కాబట్టి ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ రసవత్తంగా ఉండనుంది. ఇటు భారత్, అటు న్యూజిలాండ్ జట్ల టాప్ క్లాస్ ఆటను ఇక్కడ చూడవచ్చు. ఇలా అత్యుత్తమ బ్యాటింగ్, అదేస్థాయి బౌలింగ్ కలిగిన జట్ల మధ్య మ్యాచ్ లో కీలక అంశాలను ఓసారి పరిశీలిద్దాం.  

న్యూజిలాండ్ బ్యాటింగ్ ధాటిని భారత బౌలర్లు నిలువరించగలరా అన్నది ఇక్కడ కీలకంగా మారింది. ముఖ్యంగా కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర అద్భుత ఫామ్‌లో ఉన్నారు. వారు న్యూజిలాండ్ బ్యాంటింగ్ కు బ్యాక్ బోన్ లా మారారు. ఇక గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్ మిడిల్ ఓవర్స్ లో రెచ్చిపోతున్నారు. దీంతో తరచూ 300+ పరుగులు సాధిస్తోంది... అంతటి లక్ష్యాన్ని కూడా ఈజీగా చేధించగలమనే నమ్మకంతో ఉంది.  

 కీవీస్ ప్రధాన బలం: ఒత్తిడితో ఉన్నా పెద్ద లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ జట్టు ప్రధాన బలం. ఇదే ఆ జట్టును  ప్రత్యర్థులు భయపడేలా చేస్తోంది.  

టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ఆరంభంలోనే అదరగొడుతున్నారు.ఇద్దరూ దూకుడుగా ఆడుతూ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. ఇక మిడిల్ ఆర్డర్ లో చేస్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు. ఇండియన్ బ్యాటింగ్ విభాగానికి అతడు వెన్నెముకలా మారాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ మంచి పరుగులు సాధిస్తున్నారు. ఇలా భారత టాప్, మిడిల్ ఆర్డర్ అదరగొడుతోంది.  

టీమిండియా ప్రధాన బలం : ఈ టోర్నమెంట్ లో అన్ని జట్లకన్నా భారత టాప్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మ్యాచ్ మలుపు తిప్పగల సామర్థ్యం భారత ఆటగాళ్లలో ఉంది.  

దుబాయ్ పిచ్ బ్యాటింగ్ కంటే బౌలింగ్ కు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది... ఇప్పటివరకు ఇక్కడ జరిగిన మ్యాచుల్లో నమోదైన స్కోర్స్ ను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇక్కడ సగటు స్కోరు 240-260 మాత్రమే. గ్రూప్ దశలో ఇండియా న్యూజిలాండ్ ను 250 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించకుండా నిలువరించింది... 205 పరుగులకే కుప్పకూల్చింది. లీగ్ మ్యాచ్ లో మాదిరిగానే భారత్ ముందు బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ చేయగలిగితే మళ్ళీ న్యూజిలాండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు మరోసారి చెలరేగవచ్చు.

భారత్ ICC ఫైనల్స్ లో గత అనుభవాలను మార్చుకుని గెలుస్తుందా? లేదా మరోసారి న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూస్తుందా? ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోపీ లీగ్ మ్యాచులు, సెమీ ఫైనల్లో అదరగొట్టి ఇండియా, న్యూజిలాండ్ తమ సత్తాను చాటిచెప్పాయి. మరి ఫైనల్లో ఎవరు సత్తా చాటుతారో చూడాలి.  


--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com